03 March, 2012

శ్రీ మద్భగవద్గీత

సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం నిజంగా జరిగిన చరిత్ర ఇది. ధృతరాష్ర్టుడు, పాండురాజు అన్నదమ్ములు. పాండురాజుకి 5గురు సంతానం. యుధిష్ఠిరుడు లేక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని క్రమంగ వారి పేర్లు. ధర్మరాజు సహజంగ మంచి గుణాలు కలిగిన ధర్మమూర్తి. ఆతని సోదరులు వినయవిధేయతలు కలిగి అన్నగారి మాటను జవదాటని బుద్ధిమంతులు. చిన్నప్పుడే వీరు తండ్రిని కోల్పోయారు. ద్రౌపది వీరి భార్య. ఈమె మహాపతివ్రతయే కాక గొప్ప శ్రీకృష్ణ భక్తురాలు కూడ. ధృతరాష్ర్టడు పుట్టుగ్రుడ్డి. ఇతనికి 100 మంది సంతానం. దుర్యోధనుడు వీరిలో పెద్దవాడు. అసూయకి, అహంకారానికి, స్వార్థానికీ, వంచనకీ ఇతడు మారుపేరుగ ఉండేవాడు. పాండురాజు చనిపోవడం వల్ల, ధృతరాష్ర్టుడు అంధుడు కావడం వల్ల దుర్యోధనుడే తనని రాజుగ ప్రకటించుకొని, తన తండ్రి తరపున హస్తినాపురాన్ని పాలిస్తూ ఉండేవాడు. పాండవులకి పెరిగి పెద్దయ్యాక రాజ్యంలో కొంతభాగం రావాలి కద! కానీ, దుర్యోధనుడి మోసపుటెత్తుల వల్ల రాజ్యం రాలేదు సరిగద, 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. ఒక ఏడాది విరాట రాజు కొలువులో అజ్ఞాతవాసం కూడ చేయవలసి వచ్చింది. ఇలా 13 సంవత్సరాలు రాజ్యభ్రష్ఠులై తిరిగిన పాండవులు గడువుతీరి, తిరిగివచ్చారు. తమకు ధర్మబద్ధంగ రావలసిన రాజ్యభాగము తమకిమ్మని కబురుపంపారు కౌరవులకి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మొండి కౌరవులు, పాండవులకి రాజ్యాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితులలో యుద్ధము చేయవలసి వచ్చింది పాండవులకి. ఈ ద్వాపరయుగం చివరలో జరిగిన యుద్ధానికీ “మహాభారతయుద్ధ”మనే పేరు ప్రసిద్ధమైంది.




18 దినాలు జరిగిన ఈ మహాయుద్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొన్నదట. అందులో 11 అక్షౌహిణీల సైన్యం కౌరవుల పక్షాన పాల్గొన్నదట. 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే పాండవుల పక్షాన చేరింది. ఆశ్చర్యమేమంటే, శ్రీకృష్ణభగవానుడు కూడా పాండవుల పక్షాన అర్జున సారథిగ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఒక అక్షౌహిణీ అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 అశ్వములు, 1,09,350 పదాతిదళము. రథంలో కనీసం ఇద్దరుంటారు. ఏనుగు పై ఇద్దరుంటారు. అశ్వం పై ఒక వీరుడుంటాడు. అంటే ఒక అక్షౌహీణీలో జంతువులు కాక 1,53,090 మంది వీరులుంటారు. అలాంటివి 18 అక్షౌహణీలంటే 27,55,620 మంది మనుష్యులు + జంతువులు.



దీనిని బట్టి మహాభారత యుద్ధంలో ఎంతమంది పాల్గొన్నారో కదా! యుద్ధం పూర్తయ్యేనాటికి ఒక్కరూ మిగలనే లేదట. అంతా వీరమరణాన్నే పొందారు. భీష్మపితామహుడు కౌరవులకీ, పాండవులకీ తాతగారు. చిన్నప్పటి నుండి వివాహం చేసుకోలేదు. బ్రహ్మచర్య వ్రతంలోనే జీవించిన మహాశక్తివంతుడు. ఈయనే కౌరవసేనకు అధినేత. ద్రౌపదికి సోదరుడైన ధృష్టద్యుమ్నుడు పాండవుల సేనకు అధిపతి. యుద్ధారంభానికి ముందే మహర్షి వేదవ్యాసభగవానుడు ధృతరాష్ర్టుడి దగ్గరకు వచ్చాడు. అతనికిష్టమైతే, జరిగే యుద్ధాన్ని ఇంట్లోంచే చూడగలిగే దివ్యదృష్టిని ఇస్తానన్నాడు. “దివ్యదృష్టి” అంటే ఎక్కడ జరిగే ఏ విషయాన్నైనా తలచినంతమాత్రానే ఉన్నచోటనే ఉండి దర్శింగలిగే శక్తి అన్నమాట. కానీ ధృతరాష్ట్రుడు దానికి ఇష్టపడలేదు. తన మిత్రుడు, సారథి కూడా అయిన సంజయునికా శక్తినిమ్మన్నాడు. అవసరమైతే అతనిద్వారా వివరాలు తెలుసుకుంటానన్నాడు. వేదవ్యాసమహర్షి దివ్యదృష్టిని సంజయునికే ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు.



సంజయుడు పరమ శ్రీకృష్ణ భక్తుడే అయినా, తన యజమాని ధృతరాష్ర్టుడికి మాత్రం నమ్మినబంటు, సరే అనుకున్న ప్రకారం, మహాభారత యుద్ధం మార్గశిర మాసారంభానికి ఒక రోజు ముందు ప్రారంభమైంది. యుద్ధరంగంలో ఇరుపక్షాలు చేరి యుద్ధారంభాన్ని ప్రకటించాక అర్జునునికి హఠాత్తుగ మనసు మారిపోయింది. తన బంధువులని చంపడం తగదని, ఎంత చెడిన వారైనా యుద్ధమే వద్దనిపించింది. వారు తప్పే చేసినా, హింసించడం మంచిది కాదనిపించింది. యుద్ధం మానేసి అడుక్కొనితిని బ్రతికినా మేలేననుకొన్నాడు. “దోషి ఎవరైనా, చివరకు తన బంధువే అయినప్పటికీ, దండనార్హుడే” దండించే అధికారమున్న వ్యక్తి సమయమాసన్నమైతే, దోషిని తప్పకుండా దండించితీరడమే కర్తవ్యం. అప్పుడు బంధుత్వాన్ని, హింసనూ తలవతగదు. రోగిని శస్త్రచికిత్స ద్వారా బాగుచేయవలసిన వైద్యుడు, శరీరాన్ని కోయడం, కుట్టడం వంటి పనులు చేయక తప్పదు కదా! వాటిని హింస అనలేము గదా! అదే అవసరం కూడా. ధర్మయుద్ధంలో జరిపే హింస గూడా అలాంటిదే అనే విషయం అర్జునుడు గుర్తించలేదు. కింకర్తవ్యతామూఢుడైన అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించడానికి అన్నట్లు, లోకులందరికీ, నిత్యజీవన సమయంలో ఏ పని చేయాలో, ఏది మానాలో నిర్ణయించుకోలేని సందిగ్ధ పరిస్థితి ఏర్పడ్డప్పుడు కర్తవ్యబోధ చేసే అద్భుతమైన ఉపదేశంగ శ్రీ కృష్ణుడు అందించిన సందేశమే “భగవద్గీత”. విషాదంలో, పడి కర్తవ్యాన్ని గుర్తిచలేని మనిషికి, విశ్వసించి ఆశ్రయిస్తే, కర్తవ్యాన్ని ఆదేశించి దిశానిర్దేశం చేయగలిగిన, విజయపథంలో నడపగలిగిన ఉత్తమోత్తమమైన గ్రంథమే భగవద్గీత. యుద్ధ క్ష్రేత్రాన ఆవిర్భవించిన మహోపదేశమన్న మాట.



18 అధ్యాయాలుగా లభించిన ఈ మహోపదేశంలో 700 శ్లోకాలున్నాయి. ప్రతి అధ్యాయానికి ఏదో ఒక “...యోగః” అని పేరు. యోగమనే పదానికెన్నో అర్థాలున్నా, భగవద్గీతలోని అధ్యాయాల విషయానికి వస్తే ఉపాయము, సాధనము, మార్గము అనే అర్థాలు చెప్తారు ప్రామాణికులైన పెద్దలు. అంటే ప్రతీ అధ్యాయము గూడ ఆయా పేరు కల్గిన కర్తవ్యాన్ని తెలిపే ఒక్కొక్క సాధనమన్నమాట. శ్రీ కృష్ణుని ఉపదేశం విన్న అర్జునుడు తెలివి తెచ్చుకొని కర్తవ్యపాలనం చేసాడు. ఇక యుద్ధమారంభమైంది. సంజయుడికి దివ్యదృష్టిని యిప్పించినా, 10 దినాల దాక ధృతరాష్ర్టుడికి ఏమీ అడగాలని అనిపించలేదు. హఠాత్తుగా, 11వ దినాన భీష్మాచార్యుడు యుద్ధరంగంలో కుప్పకూలిపోయాడనే సమాచారం చేరింది. దాంతో, కృంగిపోయిన ధృతరాష్ర్టుడు సంజయుణ్ణి పిలిచాడు. “అసలేం జరిగిందయ్యా. మా వాళ్ళకీ, పాండవులుకీ కూడా భీష్ముడంటే అపరిమితమైన గౌరవం ఉందిగద! మరి వీళ్ళందరూ ఉంటూండగ ఆయనెలా పడిపోయాడు... ఏం చేస్తున్నారు వీళ్ళంతా... “అని ప్రశ్నించాడు. దివ్యదృష్టితో చూచి జరిగినదంతా చెప్పాడు సంజయుడు. అందుకే ప్రశ్నలో యుద్ధరంగంలో పోరాడలనే చేరినవాళ్ళు ఎలా యుద్ధం చేసారయ్యా “...కథమకురుత?” అని అడగాలి కానీ “..కిమకుర్వత?” ఏమి చేసారయ్యా? అని అడగడం కుదరదు గద. అలానే యుద్ధారంభానికి ముందే, అంటే మార్గశిర మాసారంభంలోనే శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసి అర్జునుణ్ణి యుద్ధంలో ప్రవేశపెట్టాడు. అయినా, ఆ రోజున ఒక్క అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ దానిని వినలేదు. బహుశః వినగలిగే స్థితిలో ఉండి ఉండరు. ధృతరాష్ర్టుడి ప్రశ్నతో సంజయుడు 11వ దినాన దానిని ప్రకటించాకనే లోకానికి యుద్ధానికి ముందుగ ఆ ఉపదేశం జరిగిందన్న విషయం తెలిసింది. అందుకే మార్గశిర శుక్ల ఏకాదశిని గీతాజయన్తిగ పాటిస్తారు. ఆనాడు, 700 శ్లోకాల భగవద్గీతను పూర్తిగ పఠించగలగడం అదృష్టం. లేదా, ఈ చరిత్రను తలచుకొని కొన్ని శ్లోకాలను చదువగలిగినా కొంత భాగ్యమే కద. ఇలా ధృతరాష్ర్టుడి ప్రశ్నతో భగవద్గీత లోకానికందిందనే కృతజ్ఞతతో, ఆయన ప్రశ్నతోనే గీతాపారాయణను ప్రారంభిస్తారు. రండి! మరి మనమూ ప్రారంభిద్దాం!



జైశ్రీమన్నారాయణ

కీసర వంశము***** KEESARAVAMSAM