28 January, 2012

సాధనలో భక్తిశ్రద్ధల ఆవశ్యకత

సాధనలో భక్తిశ్రద్ధల ఆవశ్యకత




ఒక దేవాలయప్రాంగణములో ఓ సన్యాసి భగవత్తత్వముగూర్చి భక్తులనుద్దేశించి ప్రసంగింస్తూంటుంటే ఆ ప్రసంగములను అదే దేవాలయము బయటకూర్చుని భిక్షాటనము చేసే ముదుసలి అత్యంత శ్రద్ధగా వింటూ వుండేది. ఆయన ప్రసంగములు ముగించి వేరే ప్రదేశమునకు బయలుదేరే రోజున ఈముదుసలి ఆయనవద్దకు వెళ్ళి, " ఓ మహనీయా! నాకు వయసు అయిపోతున్నది. మీరు చెప్పే మాటలన్నీ విని నేను ఆ భగవంతుని ప్రార్ధించదలచుకున్నాను. ఆ భగవంతుని ప్రార్ధన చేయటానికి నాకు మంత్రమేదైనా దయచేసి ఇప్పించండి" అని ఆయన పాదాలమీదపడి కన్నీళ్ళు పెట్టుకుంది. సన్యాసి ఆ ముదుసలికి "హే ప్రభూ !తవ పాదయే మమ శిర్ ధారయేత్, ప్రసన్న ప్రసన్న శ్రీఘ్రహ్" అని స్మరిస్తుండమన్నాడు. ఆ ముదుసలి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయన చెప్పినదానిని ఎల్లవేళలా స్మరిస్తువున్నది. ఇలా ఓపది ఏళ్ళుగడిచాయి. మళ్ళీ సన్యాసి ఆ దేవాలయమునకు విచ్చేశాడు. ఆయన ఈ ముదుసలిని చూసి గుర్తుపట్టి " ఏం అవ్వా! నేను చెప్పినదానిని స్మరిస్తున్నావా?" అనడిగాడు. అందుకావ్వ తలాడించింది. "ఏది పాఠం వప్పచెప్పు" అన్నాడాయన. ఆ ముదుసలి పదేళ్ళుగా తను స్మరిస్తున్న మంత్రమును ఆ సన్యాసి ముందుంచింది. అందుకాయన "అయ్యో! అవ్వా! తప్పు! తప్పు! నేను చెప్పినదొకటి నువ్వుచేస్తున్నదొకటి. నేను ఆయన పాదలమీద నీశిరస్సుపెట్టమంటే, నువ్వు ఆ భగవంతుని శిరస్సున నీపాదాలు పెట్టావు. నువ్వు చేస్తున్నదంతా వ్యర్ధమయ్యింది" అని ఆగ్రహమువెళ్ళగక్కి, తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇంతకూ జరిగినదేమిటంటే రోజూ స్మరిస్తూంటుంటే "తవ" "మమ" అనే పదాలు అటూఇటూ అయ్యాయి. దాంతో అర్ధము మారిపోయింది.

ఆయన చెప్పినదంతావిని ఆఅవ్వ తనుచేసిన పదేళ్ళశ్రమ వ్యర్ధమయినదని తెలుసుకొని అన్నాహారాలుమాని దు:ఖించసాగింది.

వైకుంఠములో శ్రీస్వామివారు ఈభక్తురాలి ఆర్తికి కరిగిపోయి ఆ సన్యాసి స్వప్నమందు కనిపించి, " ఓయీ! నీవు చెప్పిన మాటలకు

ఆ భక్తురాలు హతాశురాలయినది. నేను భక్తిశ్రద్ధలకు బద్ధుడనుకానీ, మంత్రములకు కాదు కదా! ఆ భక్తురాలు అన్నాహారాలుమానివేయడముతో, నాకు ఎంతమంది ఎన్ని నైవేద్యములు పెట్టినా, ఆకలితీరుటలేదు. ముందు నీవుపోయి

ఆభక్తురాలి అన్నపానీయములు విషయము చూడు" అని పలికాడు. ఆ సన్యాసి ఉలిక్కిపడి ఆ భక్తురాలి వద్దకువెళ్ళి ఆవిడ పాదాలమీదపడి, "తల్లీ నా అజ్ఞానాన్ని మన్నించు ! నీవు చేసే పూజయే ఆ భగవంతునికి ఇష్టమయ్యింది. నీ జన్మ సార్ధకమయ్యింది," అని ఆవిడని శతవిధముల వేడుకొని, ఆ భక్తురాలిని సేదతీర్చి ఈ వుదంతమును తన నాటి ప్రసంగములో ఉదహరించి, ఆభక్తురాలిని కొనియాడి, సాధకులకు భక్తిశ్రద్ధలు ఎంత ముఖ్యమో తెలియచెప్పాడు.

ఈ వృత్తాంతములో భక్తిశ్రద్ధలు ఎంత అవసరమొననికానీ, ఉచ్చారణదోషములు లేకుండా చూచుకొనవలెనని సాధకులు గమనించవలసినది.

కీసర వంశము***** KEESARAVAMSAM