22 September, 2018

బ్రాహ్మణులు - భారద్వాజ గోత్రీకుల గొప్పదనం

‘బ్రాహ్మణులు’ అనే మాట ‘బ్రహ్మన్‌’ అనే పదం నుంచి పుట్టింది అనుకోవచ్చు. ‘బ్రహ్మన్‌’ అంటే విశ్వశక్తి అని అర్థం. బ్రాహ్మణులు ఈ విశ్వశక్తిగలవారని భావన. ఈ విశ్వశక్తి ఇప్పటి మానవశాస్త్ర నిపుణులకు, పాలినేసియన్‌ భాషలోని ‘మన’ అనే అద్భుతమైన శక్తిగా పరిచయం. ‘బ్రాప్‌ా మన’ అన్నమాట. అంటే, బ్రహ్మాండమైన శక్తి అని అర్థం. ‘మన’ అనేది శక్తి అయితే, ‘మానవ’ అనే పదం శక్తిగలది, ‘మానవుడు’ అనే పదం శక్తిగలవాడు అనే అర్థం సంతరించుకుంటాయిగదా!!
‘బ్రహ్మన్‌’ అనే పదానికి ‘యజ్ఞము’ అన్న మరో అర్థాన్ని చెప్పారు ఆపస్తంబుడు. యజ్ఞాలు చేసేవారు ‘బ్రాహ్మణులు’ అని ఈ కోణంలో మనం మరో నిర్వచనాన్నీ చెప్పుకోవచ్చు.
‘బ్రహ్మ’ అంటే వేదం అనీ, జ్ఞానం అనీ, ఈ ‘బ్రహ్మ’ శబ్దానికి ‘అణ్‌’ ప్రత్యయం చేర్చటంతో ‘బ్రాహ్మణ’ శబ్దం వచ్చిందనీ శ్రీ బి.ఎన్‌. శాస్త్రి తమ ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’ (ప్రచురణ: మూసీ పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌, 2000, పే.6)లో వివరించారు. అంటే, వేదాధ్యయనం చేసినవాడు, ఆత్మజ్ఞానం తెలిసినవాడు అని అర్థమని వారి అభిప్రాయం.
‘బ్రాహ్మణః అపత్సమ్‌’ అను తద్ధిత వ్యుత్పత్తి ననుసరించి అపత్యార్థమున బ్రహ్మన్‌ శబ్దమునకు పరముగా ‘అణ్‌’ ప్రత్యయ విధానముచే అభివృద్ధి యేర్పడగా ‘బ్రాహ్మణః’ అను పద మేర్పడును. ‘బ్రాహ్మణు’డనగా శుద్ధ చైతన్య స్వరూపుడైన పరబ్రహ్మముయొక్క కుమారుడు అని అర్థము. కుమారుడనగా ఆ జాతికి చెందినవాడని అర్థము’ అనీ..
‘బ్రహ్మ అధతే బ్రహ్మ వేద వా బ్రాహ్మణః’ అనగా శుద్ధ చైతన్య రూపుడగు పరబ్రహ్మను గూర్చి గాని, వేదమునుగూర్చిగాని అధ్యయనము చేసినవాడు, తెలిసినవాడు. తదధీతే, తద్వేద అను పాణినీయ వ్యాకరణసూత్రముచే బ్రహ్మన్‌ శబ్దమునకు పరముగా ‘అణ్‌’ ప్రత్యయము, ఆదివృద్ధియు రాగా ‘బ్రాహ్మణ’ పదమేర్పడును. వేదాధ్యయనము చేసినవాడు, వేదములనుగూర్చి, పరబ్రహ్మమునుగూర్చి బాగుగా తెలిసినవాడని అర్థము. బ్రాహ్మణః ‘సంబంధి’ అను వ్యుత్పత్తినిబట్టి బ్రాహ్మణపదమేర్పడును’ అనీ ‘బ్రాహ్మణ సర్వస్వము’లో (అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన సత్రం, శ్రీశైలం వారి ప్రచురణ, ప్రథమ సంపుటము, 1994, పే. 7) ఉంది.

బ్రాహ్మణులంటే ఎవరు?

బ్రాహ్మణుల గురించిన నిర్వచనం ఈ కింది విధంగా ఉంది:
‘బ్రాహ్మణ్యాం బ్రాహ్మణాజ్ఞాతో
బ్రహ్మణః స్యాదసంశయః
జాత్యా కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన చ
ఏభి ర్యుక్తో హి య స్తిష్ఠే న్నిత్యం స ద్ద్విజ ఉచ్యతే’
అంటే, ‘బ్రాహ్మణ పురుషునివలన బ్రాహ్మణస్త్రీయందు జన్మించి, జాతి, కులము, వృత్తి, స్వాధ్యాయము, జ్ఞానములచే బ్రాహ్మణుడు అని పిలువబడుచున్నాడు’ అని అర్థం.

బ్రాహ్మణుల లక్షణాలు:

బ్రాహ్మణుల లక్షణాలను గురించిన అనేక విశేషాలను ఎందరో పెద్దలు వివరించారు.
కం. దమమును శౌచము దపమును
శమమును మార్దవము గృపయును సర్వజ్ఞాన
క్షమములు, హరిభక్తియు హ
ర్షము నిజలక్షణము లగ్రజాతికి నధిపా!
అన్నది బ్రాహ్మణుల లక్షణాలను గురించి తిక్కనామాత్యుడు మహాభారతంలో ఇచ్చిన నిర్వచనం.
ఇలాంటి నిర్వచనమే మనకు భాగవతంలోనూ ఉంది:
‘శమో దమ తపశ్శౌచం సంతోషః క్షాన్తి రార్జవమ్‌
మద్భక్తిశ్చ దయాసత్యం మ్రహ్మప్రకృతీయ స్త్వమాః’

బ్రాహ్మణుల విధివిధానాలు ఏవి?

బ్రాహ్మణుల గురించి నిర్వచనం ఇచ్చిన పెద్దలు, బ్రాహ్మణుల విధివిధానాలనూ వివరించారు:
అధ్యాపన మధ్యయనం యజనం యాజనం తథా
దానం ప్రతాగ్ర‘హశ్చైవ షట్కర్యాణ్యగ్రజన్మనః
అన్నది మనుస్మృతి వాక్యం (10`75). అంటే, తను చదువుకుంటూ ఉండడం, శిష్యులకు బోధించడం, తను యజ్ఞాలను చేయటం, యజ్ఞాలు చేయగల యజమానులచేత యజ్ఞాలను చేయించటం, దానాలు ఇవ్వడం, తీసుకోవడం అనేవి బ్రాహ్మణుల విధివిధానాలని అర్థం.

బ్రాహ్మణులు ఎక్కడివారు?

బ్రాహ్మణులు మొదట్లో భారతదేశ ఉత్తర, నైఋతి ప్రాంతాలలో ఉండేవారనీ, కాలక్రమంలో దక్షిణ ప్రాంతంవైపు కదిలి, వింధ్యపర్వతశ్రేణిని దాటారనీ అంటారు. అంటే, వీరు ఆర్యులుగా ఆరంభం అయి, దక్షిణ దేశవాసులు అయ్యారన్నమాట. అప్పట్లో వారికి బ్రహ్మ`క్షత్రియ గుణాలు ఉండేవి. అందుకే, ఆదికాలం బ్రాహ్మణులలో భరద్వాజుడు, పరశురాముడు వంటి వీరులు ఉండేవారు. కానీ, తర్వాత వారు తమ క్షత్రియ గుణాలను పూర్తిగా విడిచిపెట్టి, పాలన, మంత్రాంగం, పురహితాల వైపు దృష్టి కేంద్రీకరించారు.
ఈ మార్పు బహుశా కాకతి గణపతి దేవుని కాలంలో (క్రీ.శ. 11వ శతాబ్దం) జరిగి ఉండవచ్చునని కొందరి భావన. (దీని గురించిన వివరాలూ, వాదనలూ తర్వాత పుటలలో చూడొచ్చు.) అలా, చాలాకాలం నుంచే బ్రాహ్మణులు దక్షిణ భారతదేశంలో ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి.
ాస్తవానికి భారతదేశ చరిత్రలో మౌర్యపాలకుడైన అశోక చక్రవర్తి మరణానంతరం ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరిస్తూ, తొలి ఆంధ్ర దేశాన్ని స్థాపించి, సుమారు క్రీ.పూ. 225 నుంచి క్రీ.శ. 225 వరకూ అంటే దాదాపు 450 సంవత్సరాల కాలం అప్రతిహతంగా ఏలిన శాతవాహనులు` (ఆరువేల నియోగ?) బ్రాహ్మణులనీ అంటారు. శాతవాహనులలో సుప్రసిద్ధుడైన పాలకుడు గౌతమీపుత్ర (ఒకటవ) శాతకర్ణికి (క్రీ.శ. 78` 102) ‘వినివర్తిత చతుర్వర్ణ సంకరస్య’ (చతుర్వర్ణాలలో సంకరాన్ని నివారించినవాడు) అన్న బిరుదం ఉండేదని అతని తల్లి గౌతమీ బాలశ్రీ (నేటి మహారాష్ట్రలోని) నాసిక్‌లో వేయించిన శాసనంవల్ల తెలుస్తోంది. అలాగే, ఆయనకు ‘ఆగమానాం నిలయస్య’ (ఆగమాలకు నిలయమైన వాడు) అనీ, ‘ఏక బ్రాహ్మణస్య’ (ఏకైక బ్రాహ్మణుడు), ‘ద్విజకులవర్ధనుడు’, ‘వర్ణాశ్రమ ధర్మ పరిత్రాత’ అనీ అనేక బిరుదాలుండేవి. మొత్తం 30 మంది రాజులుగా ఏలిన వీరికి ‘సాతవాహనులు’ లేదా ‘శాతవాహనులు’ అనేది వంశనామం అయితే, ‘సాతకర్ణి’ లేదా ‘శాతకర్ణి’ అనేది వీరి గోత్రం అని ఆచార్య ఖండవల్లి గారు పేర్కొంటున్నారు (పే.103). అంటే, అప్పటికే బ్రాహ్మణ కులం విస్తృతంగా వ్యాప్తి చెందిందని మనం గుర్తించవచ్చు.
అంతేకాకుండా, ఇదే నాసిక్‌ శాసనంలో ` గౌతమీ బాలశ్రీ తన కుమారుడైన గౌతమీపుత్ర శాతకర్ణి ` నహుషుడు, నాభాగుడు, దిలీపుడు, బలరాముడు, కేశవుడు, రాముడు, అర్జునుడు వంటి పురాణపురుషులకు దీటైనవాడని పేర్కొంది. అంటే ఆపస్తంబుడి కాలంలోనో, కొంచెం అటూఇటూగానో ఆరంభం అయిన పురాణ రచన పూర్తయి ప్రజలలో పురాణాలు బహుళ ప్రాచుర్యం పొందాయన్నదీ ఈ శాసనం వల్ల స్పష్టం.
శాతవాహనులలో సిముఖుని (శ్రీముఖుడు) కుమారుడు, పైన పేర్కొన్న గౌతమీపుత్ర (మొదటి) శాతకర్ణి ఎన్నెన్నో క్రతువులను చేశాడన్న చరిత్ర ఆధారాలు ఉన్నాయి. వాటిలో అగ్న్యాధ్యేయ, అనారంభణీయ, భగలా దశరాత్ర, గర్గ త్రిరాత్ర, గవామయన, ఆప్తుర్యామ, అంగిరసామయన, శతా త్రిరాత్ర, ఛందోమపవమాన త్రిరాత్రాది క్రతువులు, అశ్వమేధ, రాజసూయ యాగాలు ఉన్నాయి. ఇక, అతని సతీమణి అయిన నాగానీక వేయించిన నానాఘాట్‌ శాసనంలో ఆమె తన్నుతాను ‘దిఖావ్రత (దీక్షావ్రత) యజ్ఞసుందయా’ (అంటే, దీక్షావ్రతముతో యజ్ఞముచేసిన సౌందర్యవతి అన్న అర్థం కావచ్చు) అనీ, ‘యజ్ఞాహుత ధూపన సుగంధాయ’ (అంటే, యజ్ఞసమయంలో వెలువడిన ధూపాలు వదలిన సుగంధాలు కల పరిమళ అన్న అర్థం కావచ్చు) అనీ వర్ణించుకుంది. ఇక, ఆ దంపతుల బిడ్డ పేరు ‘వేదశ్రీ’ కావటంలో ఆశ్చర్యం ఏముందీ!! అలాగే, శాతవాహనులలో మరొకడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆ కాలంనాటికే వేదాలు సుప్రసిద్ధం అయినాయనీ, విరివిగా యజ్ఞాలు జరుగుతుండేవనీ వివరించటం కోసమే ఇవన్నీ పేర్కోవటం!!
ఇదెలా ఉన్నా, శాతవాహనుల రాజ్యపాలన క్రీ.పూ. 225లోనే ప్రారంభం అయినా, శాతవాహన శకం క్రీ.శ. 78తో ఆరంభం అయింది. ఇది శాతవాహనులలో ఒకడైన గౌతమీపుత్ర (మొదటి) శాతకర్ణి విజయరాజ్య ప్రారంభ సూచికగానే జరిగింది. భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి పాటిస్తూ వచ్చినవి రెండే రెండు శకాలు. ఒకటి ` క్రీ.పూ. 58 నుంచి ప్రారంభం అయిన విక్రమాదిత్య శకంకాగా, రెండోది క్రీ.శ. 78 నుంచి ఆరంభమయిన శాలివాహన శకం. ఇందులో శాలివాహన శకం బ్రాహ్మణులపరంగా గుర్తింపు పొందటం గర్వకారణం. (యుధిష్టిర శకం అని మరొకటి కూడా ఉందని కొందరి భావన.)
సియామ్‌, కాంబోడియా దేశాలలో సైతం శాలివాహన శకం ప్రాచుర్యంలో ఉందని తమ ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో (పే.139) శ్రీ బి.ఎన్‌.శాస్త్రి గారు వివరిస్తున్నారు.
మహాకవి కాళిదాసు రచించిన ‘రఘువంశం లోని 13వ సర్గ, 34 శ్లోకంలో శాతకర్ణి అనే ఒక బ్రాహ్మణ ఋషి ప్రస్తావన ఉంది. ఆ మహర్షి సంతతివారే శాతవాహనులై ఉంటారని డా. మారేమండ రామారావుగారు ‘సాతవాహన సంచిక’లో పేర్కొన్నారు.
శాతవాహనులు బ్రాహ్మణులు అన్నది నిజమే, కానీ, వీరు నియోగి బ్రాహ్మణులన్నది కొంత సందేహాస్పదం. శాతవాహనుల కాలం నాటికి వైదికి, నియోగి భేదాలు ఏర్పడిన సూచనలు ఎక్కడా కానరావటం లేదు. ఈ భేదాలు క్రీ.శ. 11`12 శతాబ్దాల ప్రాంతాలలో తలెత్తి ఉండవచ్చు. శాతవాహనులది క్రీస్తుపూర్వం, క్రీస్తుశకారంభంనాటి కాలం కదా! చరిత్ర కొంచెం అటూఇటూ అనుకున్నా, దాదాపు వెయ్యి సంవత్సరాల వ్యత్యాసం రావటం అసాధ్యం!!
ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఇక్ష్వాకులు కూడా బ్రాహ్మణులే! ఇక్ష్వాకుల మహారాజైన మొదటి చాంతమూల మహారాజు, మాఠరీ గోత్ర సంభవ అయిన ఒక విప్రకన్యను వివాహమాడినందువల్ల వీరు బ్రాహ్మణులేనని నిర్ధారించవచ్చునని శ్రీ బి.ఎన్‌.శాస్త్రి గారు తమ ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో (పే.87) పేర్కొన్నారు. ఈ (శాం) చాంతమూల చక్రవర్తి అగ్నిష్టోమ యాగాన్ని చేశాడు. ఇది బ్రాహ్మణులు మాత్రమే చేసే యాగం. ఇలాంటి యాగాన్నే క్షత్రియులు చేస్తే దాన్ని ‘జ్యోతిష్టోమ యాగం’ అంటారు.
శాతవాహనులు, ఇక్ష్వాకుల తర్వాత ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులలో బృహత్ఫలాయనులు (బృహత్పలాయనులు), ఆనంద గోత్రికులు, శాలంకాయనులు ముఖ్యులు.
బృహత్ఫలాయనులు బ్రాహ్మణులే. క్రీ.శ. 270`285ల ప్రాంతానికి చెందిన వీరి రాజధాని కృష్ణాతీరంమీద ఘంటసాలకు 20 మైళ్ల దూరంలో ఉన్న కోడూరు.
శాతవాహనులు, బృహత్ఫలాయనులకుమల్లే ఆనందగోత్రికులు సైతం బ్రాహ్మణులే. వీరు క్రీ.శ.300 నుంచి క్రీ.శ. 440 వరకు పరిపాలించారు. తమ గోత్రం పేరునే వంశనామంగా ధరించిన వీరు బ్రాహ్మణులని చరిత్ర చెప్తోంది. అయితే, వీరు విశ్వామిత్ర సంతతిలోని శాలంకు లేదా శాలంక వంశీయుడైన శాలంకాయన మహర్షి సంతతివారు అన్న మరొక వాదం కూడా ఉంది. అయితే, ఆనందగోత్రికులు, బృహత్ఫలాయనులు, పల్లవులలాగనే వీరు కూడా తమ పేర్ల చివరన ‘వర్మ’ అని పెట్టుకోవటంవల్ల వీరూ బ్రాహ్మణులేనని భావించ వీలున్నదని శ్రీ బి.ఎన్‌.శాస్త్రి అంటున్నారు. వీరి రాజధాని వేంగీపురం. (ఇప్పటి ఏలూరుకు సమీపంలోని పెదవేగి, చినవేగి ప్రాంతాలు.)
ఆంధ్రదేశంలో శాలంకాయనుడు ఒక గోత్ర ఋషిగా రెండు ప్రవరలతో కూడిన వారు ఉన్నారని శ్రీ బి.ఎన్‌.శాస్త్రి గారు తమ ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో (పే.151) రాశారు. వారు:
1. ఆంగిరస, బార్హస్పత్య, భారద్వాజ, శాలంకాయన
2. విశ్వామిత్ర, శాలంకాయన, కౌశిక
(అయితే, చిత్రంగా 1890లనాటి ఒక గోత్రపట్టికలో శాలంకాయన గోత్రికులు మూడు ప్రవరలతో కానరావటం విశేషం. వీటిలోనూ పైన పేర్కొన్న మొదటి ప్రవర లేదు. చూ. ఈ పుస్తకంలో అనుబంధంగా ఉన్న గోత్రపట్టిక.)
‘సాన్‌లన్‌ క్రోన్‌’ అనే ఒక శాలంకాయన రాజు బర్మాలోని ఐరావతీ నదీ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తోంది. ఈ శాలంకాయనులే బర్మా దేశంలో బౌద్ధమతం వ్యాపించడానికి కారణం అని వివరిస్తోంది.
అలాగే, క్రీ.శ. మూడవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకూ దక్షిణాపథంలో రాజ్యం చేసిన పల్లవులుసైతం బ్రాహ్మణులేననీ చరిత్ర చెప్తోంది. ‘భారద్వాజ గోత్రానామ్‌ పల్లవానామ్‌’ అని పల్లవులే స్వయంగా చాటుకున్నారు. వీరు తాము అశ్వత్థామకు, మదన అనే ఒక అప్సరసకు జన్మించిన వారుగా ఒక గాధను ప్రచారంలోకి తెచ్చారు. భరద్వాజుని కుమారుడు ద్రోణుడు కాగా, ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ అన్నది తెలిసిందే!! అలా, ఆ గాధను పరిగణనలోకి తీసుకున్నా, పల్లవులు బ్రాహ్మణులేనన్నది స్పష్టం. పల్లవులలో శివస్కంద వర్మ (క్రీ.శ. 310`335) వేయించిన హిరహడగళ్లి శాసనం వల్ల ఈయన అగ్నిష్టోమ, వాజపేయ అశ్వమేధ యాగాలను చేస్తునట్లు తెలుస్తోంది. ఆ శాసనంలో` పూర్తి పాఠం
‘అగ్గిధోమ, వాజపేయస్స మేధయాజీ ధమ్మ మహారాజాధిరాజో
భారద్దాయో పల్లవాణ సివఖందవమో... ’ అని ఉంది.
అలాగే, పల్లవ వంశ స్థాపకుడైన వీరకూర్చ వర్మ పదవ రాజ్య సంవత్సరంలో, అతని కుమారుడైన విజయస్కంద వర్మ వేయించిన మైదవోలు శాసనంలో ‘యువమహారాజో భారదాయజ గోత్తో పలవానాం శివఖందవమ్మో...’ అనీ ఉంది. ఈ శాసనం వల్ల వీరు బ్రాహ్మణులనీ, భారద్వాజ గోత్రికులనీ స్పష్టం. ఇక్కడా వైదికి, నియోగుల ప్రసక్తి లేదనీ గుర్తించాలి.
వేంగీ చాళుక్యుల కాలంలో ఆంధ్రమహాభారత కావ్య రచన ప్రారంభం అయింది. ఈ ఆంధ్రీకరణ యజ్ఞాన్ని ఆరంభించిన నన్నయ భట్టారకుడు, కొనసాగించిన తిక్కన సోమయాజి, పూర్తి చేసిన ఎర్రాప్రగడలు ముగ్గురూ బ్రాహ్మణ వంశస్థులు కావటం విశేషం.
ఇటు కర్ణాటకను చిరకాలం ఏలిన కదంబ వంశస్థాపకుడైన మయూర శర్మకూడా బ్రాహ్మణుడే!!
బ్రాహ్మణులకు అనాదినుంచీ సమాజంలోని ఇతరులనుంచి ఎంతో గౌరవప్రపత్తులు లభించేవి. ప్రతీ గ్రామంలోనూ, ఆ గ్రామపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకోసం ఐదుగురు సభ్యులతోకూడిన ‘పంచప్రధానులు’ ఉండేవారని చరిత్ర చెప్తోంది. ఇదే నేటి ‘గ్రామ పంచాయత్‌’ వ్యవస్థకు ఆది అయింది. వారిలో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణులు ఉండేవారు.
సుమతీశతకకారుడైన బద్దెన రాసిన ఒక గొప్ప పద్యాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవటం అవసరం:
‘అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేరున్‌ ద్విజుడున్‌
చొప్పడిన ఊర నుండుము
చొప్పడక యున్నట్టి నూరు జొరకుము సుమతీ!!’
ఒక ప్రదేశం ‘ఊరు’ అనిపించుకోవాలంటే, దానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలలో ‘బ్రాహ్మణుడు ఉండటం’ కూడా ఒకటి అన్నది సుమతీ శతకమంతటి శాశ్వత సత్యం!!
12వ శతాబ్దానికి చెందిన కాశ్మీర దేశ పండితుడైన కల్హణుడు రాసిన ‘రాజతరంగిణి’లో
‘కర్ణాటకాశ్చ తైలంగా ద్రావిడ మహారాష్ట్రకాః
గుర్జరాశ్చేతి పంచైవ ద్రావిడా వింధ్యదక్షిణే
సారస్వతా కన్యాకుబ్జా గౌడా ఉత్కళ మైథిలాః
పంచగౌడా ఇతి ఖ్యాతా వింధ్యస్యోత్తర వాసినః’
అని ఉంది. అంటే, 12వ శతాబ్దకాలంనాటికి పూర్వంనుంచే బ్రాహ్మణులు పలు శాఖలుగా ఉండేవారనీ, వారు ఉత్తరదక్షిణ భారతంలో పంచ గౌడీయులుగా, పంచ ద్రావిడులుగా పేరు పొందారనీ స్పష్టం. సారస్వత, కన్యాకుబ్జ, గౌడ, ఉత్కళ, మైథిలీ అనేవి బ్రాహ్మణులలో పంచ గౌడీయ శాఖలు కాగా, కర్ణాటక, తైలంగ, ద్రవిడ, మహారాష్ట్ర, గుర్జరా (గుజరాత్‌) అనేవి పంచ ద్రావిడ బ్రాహ్మణ శాఖలని కల్హణుడు వివరించాడు. వింధ్య పర్వతాలకు దక్షిణ భాగంలోని ‘తైలంగా’, అంటే తెలుగు వారు నివసించే ప్రాంతాలలో బ్రాహ్మణులు ఉన్నారని అర్థం. (పూర్తిగా ఇదే శ్లోకం మనకు ‘బృహజ్జోతిషార్ణవాంతర్గతషష్టమిశ్ర స్కంధోక్త షోడశాధ్యాయ బ్రాహ్మణోత్పత్తి మార్తాండమ్‌’ లోనూ కానవస్తోంది.)
అలాగే, బ్రాహ్మణులు అనాదికాలంలోనే విదేశాలకు సైతం వెళ్లారనీ, వారు అక్కడ బ్రాహ్మణ కులానికి ఆద్యులైనారనీ చరిత్ర చెప్తోంది. బర్మాలోని పునాన్‌ రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం ‘కౌండిన్య సోమ వంశం’. గోదావరి ముఖద్వారం నుంచి వచ్చిన కౌండిన్యుడనే బ్రాహ్మణుడు, పునాన్‌లోని సోమ అనే యువతిని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ రాజవంశం ఏర్పడిరదని సుప్రసిద్ధ చరిత్రకారులు శ్రీ మారేమండ రామారావు తమ ‘ఆంధ్ర దేశ చరిత్ర’లో (పే.35) పేర్కొన్నారు.
అదేవిధంగా, క్రీ.శ. 657లో, నేటి వియత్నాం దేశంలో రుద్రవర్మ, క్రీ.శ. 781లో నేటి కంపూచియా (ఒకప్పటి కాంబోడియా లేదా కాంభోజ దేశం)లో ఒకటవ జయవర్మలు సైతం బ్రాహ్మణులేనని చరిత్ర చెప్తోంది.
ఇలాగే, ఎందరో మహానుభావులు బ్రాహ్మణులలో ఉన్నారు. మహాయాన బౌద్ధమతాభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆచార్య నాగార్జునుడు బౌద్ధమత స్వీకరణకు ముందు విదర్భకు చెందిన బ్రాహ్మణుడు. బౌద్ధానికి ప్రతిగా శైవాన్ని ఉద్బోధించిన బసవేశ్వరుడు బ్రాహ్మణుడు. అలాగే, బ్రహ్మనాయుడు ప్రవేశపెట్టిన చాపకూడు ఉద్యమంలో పాల్గొని, తమ సహనాన్ని చాటిచెప్పిన పలనాటి సేనాని అనపోతరాజు బ్రాహ్మణుడు. కాకతీయుల కాలంలో రుద్రమదేవి సేనాని అయిన బెండపూడి అన్నయ్య బ్రాహ్మణుడు.
మహాకవి కాళిదాసు, వయ్యాకరణుడు పాణిని, అర్థశాస్త్ర సృష్టికర్త చాణక్యుడు, నాటి బాణభట్టుల నుంచి నేటితరం నోబెల్‌ పురస్కార గ్రహీతలు రవీంద్రనాథ్‌ టాగూర్‌, సి.వి.రామన్‌, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్‌లు, శరత్‌ చంద్ర ఛటర్జీ, బంకిమ్‌ చంద్ర ఛటర్జీ, సత్యజిత్‌ రే, షర్మిలా టాగూర్‌, తెలుగువారిలో ప్రప్రథమ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ, జిడ్డు కృష్ణమూర్తి ప్రభృతులూ బ్రాహ్మణ ప్రముఖులే. అలాగే, 1857లో ప్రథమ స్వాతంత్య్ర సమరంగా పేరొందిన సిపాయి విప్లవంలో కీర్తిశేషులైన మంగళ్‌ పాండేకూడా బ్రాహ్మణుడే!!
ఇక, ఇటీవలి కాలానికి వస్తే, భారతదేశ తొలి ఉపాధ్యక్షుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, తర్వాత కాలంలో దేశాధ్యక్షులైన వి.వి.గిరి, ఆర్‌.వెంకట్రామన్‌, శంకర్‌ దయాళ్‌ శర్మ, ఇప్పటి దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ, తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, తర్వాత కాలంలో దేశ ప్రధానులు అయిన మొరార్జీ దేశాయ్‌, అతుల్‌ బిహారి వాజ్‌పేయీ, దేశాన్ని తీవ్ర ఆర్థికరంగ సంక్షోభం నుంచి బయటపడేసిన ప్రధాన మంత్రి,
ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకూ ఏకైక బ్రాహ్మణ ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు, ఆంధ్ర రాష్ట్ర తొలి గవర్నర్‌ చందూలాల్‌ మాధవలాల్‌ త్రివేది, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, ‘కాంగ్రెస్‌ చరిత్ర’ను రాసిన వారు, ఆంధ్రా బ్యాంక్‌ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య... అందరూ బ్రాహ్మణులే! ఇక, వర్తమానంలో దేశ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మమతా బెనర్జీ, సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ, ఇన్ఫోసిస్‌ స్థాపకులు ఎన్‌.ఆర్‌. నారాయణ మూర్తి, నందన్‌ నీలేకని, కిరణ్‌ మజుందార్‌, విజయ్‌ మాల్యా ప్రభృతులు, మన రాష్ట్రంలోని రాజమండ్రి నియోజకవర్గంనుంచి లోక్‌సభ సభ్యులుగా ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌... అందరూ బ్రాహ్మణులే!!
సుప్రసిద్ధ చరిత్రకారులు డి.డి. కోశాంబి యథాతథ వ్యాఖ్యలతో ఈ భాగాన్ని ముగించడం సమంజసంగా ఉంటుంది: ‘ఆర్య, ఆదిమవాసుల పునఃకలయికలవల్ల ఒక కొత్త ప్రత్యేక వర్గం అభివృద్ధి చెందింది. అది క్రమేణా మొత్తం ఆర్య కర్మకాండల మీద ఆధిపత్యం వహించింది. అదే బ్రాహ్మణ కులం. ప్రాచీన పవిత్ర గ్రంథాలలో మనకు లభ్యమైనవి ఈ కులమే భద్రపరిచింది, ఈ కులమే తిరగరాసింది... ఏమైనా, వాళ్లు ఒక కార్యం నిర్వహించారు. దాని విలువ అరుదుగా గుర్తించడం జరిగింది. మామూలుగా ప్రతిస్పర్థిగా ఉండే బృందాలను సదృశం చేయడం. వాళ్లు బహువిధ నూతన ఆరాధనలతో సహా, సమష్టి దేవతలను ఆరాధించే ఏకసమాజంగా సమానం చేశారు’. (ప్రాచీన భారత సంస్కృతి ` నాగరికత, ఆంగ్ల మూలం: డి.డి. కోశాంబి, తెలుగు అకాడమీ ప్రచురణ, 1998, పే.74).
సమాజాన్ని మార్క్సిస్టు దృక్పథంతో నిశిత పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి నిష్పక్షపాతంగా ఇచ్చిన ఈ గొప్ప యోగ్యతాపత్రం ఒక్కటి చాలు ` బ్రాహ్మణులు మన సమాజానికి చేసిన సేవను జ్ఞప్తికి తెచ్చుకోవటానికి!!

బ్రాహ్మణులలో తరగతులు

‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నారు వేమన. అలాగే, బ్రాహ్మణ వంశంలో జన్మించినంత మాత్రాన అందరూ బ్రాహ్మణులు కారు, కాలేరని అంటారు. మరి, బ్రాహ్మణ కులంలో పుట్టినవారిని ఏ విధంగా విభజించాలో అదీ ఈ దిగువ ఉన్న వర్గీకరణ ద్వారా గుర్తించవచ్చు:
  • జన్మమాత్రం చేత బ్రాహ్మణ వీర్య క్షేత్రాలను కలిగి, బ్రాహ్మణ కులంలో జన్మించినా, బ్రాహ్మణోచితమైన ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని ‘మాత్రులు’ అంటారు.
  • వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి పెట్టి, వైదికాచారాలను పాటిస్తూ, శాంతస్వభావులై, ఏకాంతప్రియులై, సత్యధర్మాచరణ చేస్తూ, దయాళురై ఉండే బ్రాహ్మణ జాతి వారిని ‘బ్రాహ్మణులు’ అంటారు.
  • బ్రాహ్మణులలో పుట్టి, వేదంలోని ఒక శాఖను శిక్షాధిషడంగాలతో పూర్తిగా చదివి, బ్రాహ్మణోచితమైన అధ్యయనము, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహాలనే ఆరు కర్మలను ఆచరించే ధర్మజ్ఞులను ‘శ్రోత్రియులు’ అంటారు.
  • నాలుగు వేదాలను, వేదాంగాలను తత్వార్థాలతో కలిపి తెలుసుకొని, పాపరహితులై, శుద్ధమనస్కులై, శ్రోత్రియ విద్యార్థులను చదివిస్తూ ఉండే విద్వాంసులైన విప్రులను ‘అనూచానులు’ అంటారు.
  • పైన చెప్పిన అనూచాన గుణాలన్నీ కలిగి, కేవలం యజ్ఞస్వాధ్యాయాలలో నిమగ్నమై ఉంటూ, యజ్ఞశిష్టాన్నం మాత్రమే భుజిస్తూ, ఇంద్రియాలను తమ వశములో పెట్టుకున్న వారిని ‘భ్రూణులు’ అంటారు.
  • సంపూర్ణ వైదిక, లౌకిక జ్ఞానాలను కలిగి, మనస్సును, ఇంద్రియాలను వశంలో ఉంచుకుని, ఎల్లప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో ఉన్న వారిని ‘ఋషి కల్పులు’ అంటారు.
  • ఎప్పుడూ రేతస్కలనం లేక, నియమితాహారం భుజిస్తూ, ఏ విషయంలోనూ సందేహం లేని వారై, శాపానుగ్రహ సమర్థులై, సత్యప్రజ్ఞులైన వారిని ‘ఋషులు’ అంటారు.
  • ఏ కోరికలూ లేక, నివృత్తిమార్గంలో ఉంటూ, సంపూర్ణ తత్వజ్ఞానం కలిగి, కామక్రోధరహితులై, ధ్యాననిష్ట్ఠులై క్రియా రహితులై, జితేంద్రియులై మట్టినీ, బంగారాన్నీ రెంటినీ సమానంగా చూడగల బ్రాహ్మణులను ‘మునులు’ అంటారు.

No comments:

కీసర వంశము***** KEESARAVAMSAM